పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన కెనడా, ఆస్ట్రేలియా, యూకే..!
ఈవారం న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కెనడా, ఆస్ట్రేలియా రెండూ పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్నట్లు ప్రకటించాయి.పాలస్తీనాను సార్వభౌమ రాజ్యంగా గుర్తించాలనే కెనడా నిర్ణయాన్ని ఆస్ట్రేలియా అనుసరించిందని ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ రాశారు.
ఇది కెనడా, బ్రిటన్లతో చేసిన సంయుక్త ప్రయత్నంలో భాగమని, టూ స్టేట్ సొల్యూషన్(రెండు దేశాల)ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు.పాలస్తీనా దేశాన్ని యూకే అధికారికంగా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు.
"శాంతి, టూ స్టేట్ సొల్యూషన్ (రెండు దేశాల) ఆశను పునరుద్ధరించేందుకు యునైటెడ్ కింగ్డమ్ అధికారికంగా పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తోందని ఈ దేశ ప్రధాన మంత్రిగా స్పష్టం చేస్తున్నా" అని ఆయన ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.మనం కోరుకుంటున్న శాంతియుత భవిష్యత్తును తీసుకొచ్చేందుకు మన ప్రయత్నాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఇతర దేశాలకు పిలుపునిచ్చారు.
పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తూ యూకే, కొన్ని ఇతర దేశాలు చేసిన ఏకపక్ష ప్రకటనను ఇజ్రాయెల్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఎక్స్లో పోస్టు చేసింది.'ఈ ప్రకటన శాంతిని ప్రోత్సహించదు, దీనికి విరుద్ధంగా- ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరపరుస్తుంది.
భవిష్యత్తులో శాంతియుత పరిష్కారాన్ని సాధించే అవకాశాలను దెబ్బతీస్తుంది' అని తెలిపింది.గతంలో, పాలస్తీనాకు గుర్తింపుపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు.గత నెలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్కు లేఖ రాస్తూ "ఈ యూదు వ్యతిరేక అగ్నికి ఆజ్యం పోస్తున్నారని" ఆరోపించారు.
ఈ చర్య అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ దాడి తర్వాత 'రివార్డు' ఇస్తున్నట్లుగా ఉందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.