Thailand Cambodia War: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య వార్… రెండు దేశాల మధ్య భీకర కాల్పులు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌... అంతకుముందు రష్యా ఉక్రెయిన్... యుద్ధపీడిత దేశాల జాబితాలోకి ఇప్పుడు నయా ఎంట్రీ వచ్చి చేరింది. థర్డ్ వరల్డ్‌వార్ కమింగ్‌సూన్ అని సంకేతాలిస్తూ వార్‌జోన్ కంటిన్యూ ఔతుందా అనిపించేలా... ఆగ్నేయాసియాలో మళ్లీ యుద్ధం షురువైంది. థాయ్‌లాండ్‌ -కంబోడియా దేశాల మధ్య భీకర కాల్పులు మొదలయ్యాయి.

Jul 28, 2025 - 08:31
 0  3

ఇరాన్‌-ఇజ్రాయెల్‌… అంతకుముందు రష్యా ఉక్రెయిన్… యుద్ధపీడిత దేశాల జాబితాలోకి ఇప్పుడు నయా ఎంట్రీ వచ్చి చేరింది. థర్డ్ వరల్డ్‌వార్ కమింగ్‌సూన్ అని సంకేతాలిస్తూ వార్‌జోన్ కంటిన్యూ ఔతుందా అనిపించేలా… ఆగ్నేయాసియాలో మళ్లీ యుద్ధం షురువైంది. థాయ్‌లాండ్‌ -కంబోడియా దేశాల మధ్య భీకర కాల్పులు మొదలయ్యాయి. అక్కడ ఆరంభమే అదిరిపోతోంది. F-16 యుద్ద విమానాలు గర్జిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలపై ఒకరిపై ఒకరు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. థాయ్‌లాండ్-కంబోడియా యుద్ధంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 33కి చేరింది.

పర్యాటక స్వర్గధామంగా పేరున్న థాయ్‌ల్యాండ్‌కి, పొరుగు దేశం కంబోడియాకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటోంది. 817 కి.మీ సరిహద్దును పంచుకుంటున్న వీటి మధ్య ఎప్పుడూ ఏకాభిప్రాయం లేదు. వివాదాస్పద ప్రాంతంలో కంబోడియా పెట్టిన ల్యాండ్ మైన్లు పేలి థాయ్‌ల్యాండ్ సైనికులు గాయపడ్డం దగ్గర మొదలైంది రగడ. పరస్పర కాల్పులు, గ్రనేడ్, రాకెట్ లాంఛర్ల ప్రయోగాల దాకా వెళ్లాయి టెన్షన్ సీన్లు.

థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుకు సమీపంలోని డాంగ్రెక్ పర్వతాలపై వెయ్యేళ్ల కిందట నిర్మించిన పురాతన హిందూ ఆలయం ఉంది. దీని మీద ఆధిపత్యం కోసమే రెండు దేశాలూ కత్తులు నూరుతుంటాయి. ఇక్కడ శివలింగంతో పాటు ఇతర హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే రెండు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. 

అందుకే.. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు రాజకీయ, సైనిక పరంగా కూడా ఈ గుడికి ప్రాముఖ్యత ఉంది. థాయ్‌లాండ్, కంబోడియా సైనికులు తరచూ ఘర్షణలకు పాల్పడ్డంతో ఇక్కడ టూరిస్టుల సంఖ్య కూడా పల్చబడింది. ఈ ఆలయం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలన్న పట్టుదల ఇప్పుడీ యుద్ధానికి ఆజ్యం పోసింది.

రెండు నెలల కిందటే ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయ్ -కంబోడియా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక కంబోడియా సైనికుడు చనిపోయాడు. అప్పటినుంచీ రెండు దేశాలూ సరిహద్దుల దగ్గర బలగాలను పెంచేశాయి. జూన్‌లో జరిగిన చర్చలు కొంత పురోగతిని సాధించినట్టు కనిపించినా, జులైలో తామున్ థోమ్ ఆలయం దగ్గర జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు మళ్లీ టెన్షన్లు పెంచేసింది. దాని ఫలితమే.. కంబోడియా సరిహద్దుల్లో సైనిక స్థావరాలపై థాయ్‌లాండ్‌ వైమానిక దాడి. ఏకంగా F-16 యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ థాయ్‌కి గట్టిగానే కౌంటరిచ్చింది కంబోడియా. థాయ్‌లాండ్‌ బంకర్లను టార్గెట్‌ చేసి, గ్యాస్‌ స్టేషన్లను ధ్వంసం చేశాయి కంబోడియా మిస్సైళ్లు.

వెయ్యేళ్ల నాటి ఒక శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాల యుద్ధం… ఇప్పుడు ప్రపంచ వార్తగా మారింది. కంబోడియా ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, థాయిలాండ్ ద్వైపాక్షిక చర్చలు ఓకే చెప్పినా తెగని ఆధిపత్య పోరాటానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు.