డిజిటల్ సర్వీస్ ట్యాక్స్: ప్రపంచ దేశాలకు డోనల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక, భారత్ ఏం చేయవచ్చు?

వాస్తవానికి, ట్రంప్ ప్రభుత్వంతో వాణిజ్య ఒప్పందాన్ని సులభతరం చేస్తుందనే ఆశతో భారత్ ఈ పన్నును రద్దు చేసింది. కానీ, ఇప్పుడు భారత్పై ట్రంప్ 50 శాతం సుంకాన్ని ప్రకటించడంతో, భారత్ కూడా యూటర్న్ తీసుకోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.
భారత మీడియాలో ప్రచురితమైన రిపోర్టుల ప్రకారం, భారత ప్రభుత్వం ప్రతీకార చర్యగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్తో పాటు మెటా, అమెజాన్ వంటి సంస్థలపై డిజిటల్ సేవా పన్ను విధించవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే, భారత ప్రభుత్వం డిజిటల్ సేవా పన్నును అంటే నాన్-రెసిడెంట్ అమెరికన్ టెక్ కంపెనీలపై 'ఈక్వలైజేషన్ లెవీ'ని రద్దు చేసింది. 2025-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రకటించింది. ఈ ఉత్తర్వు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
అమెరికన్ టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్స్ లేదా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్లు విధించే దేశాలు వాటిని రద్దు చేయాలని లేదా ఆయా దేశాలు తమ ఎగుమతులపై మరిన్ని సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
"డిజిటల్ పన్నులు, చట్టాలు, నియమాలు లేదా నిబంధనలు ఉన్న అన్ని దేశాలను హెచ్చరిస్తున్నాను. ఈ వివక్షత చర్యలు రద్దు చేయకపోతే, అమెరికా అధ్యక్షుడిగా, ఆ దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తాను. అమెరికా అత్యంత రక్షణాత్మకమైన సాంకేతికతలు, చిప్ల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తాను" అని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాశారు.
డిజిటల్ సర్వీస్ టాక్స్ అనేది ప్రభుత్వాలు అక్కడ భౌతికంగా ఉనికిలో లేని పెద్ద అంతర్జాతీయ టెక్ కంపెనీలపై విధించే పన్ను. ఈ కంపెనీలు ఆ దేశం వెలుపల నుంచి పనిచేస్తాయి.
సాధారణంగా, ఆ దేశంలో శాశ్వత ఉనికి ఉన్న కంపెనీపై మాత్రమే కార్పొరేట్ పన్ను విధిస్తారు. కానీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గూగుల్, మెటా, అమెజాన్ లేదా నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీలు ఏ దేశంలోనూ కార్యాలయం తెరవకుండానే బిలియన్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని చేయగలవు.