‘రియల్‌’ సెటిల్‌మెంట్ల గొడవ.. రౌడీషీటర్‌ దారుణ హత్య

16 September 2026 - 12:58
0 0
‘రియల్‌’ సెటిల్‌మెంట్ల గొడవ.. రౌడీషీటర్‌ దారుణ హత్య
01
  • పంపకాల్లో తేడాపై ఆగ్రహం
  • కడాయి, వేట కొడవళ్లతో దాడి
  • బండ్లగూడలో ఘటన..

మన్సూరాబాద్‌, సెప్టెంబర్‌ 15 : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చిన డబ్బు పంపకాల వివాదం ముదిరి ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ రౌడీషీటర్‌ తన గ్యాంగ్‌తో కలిసి మరో రౌడీషీటర్‌ కండ్లల్లో కారం చల్లి.. కడాయి, వేట కొడవళ్లతో దాడి చేసి అంతమొందించాడు. సంచలనం రేపిన ఈ ఘటన సోమవారం రాత్రి హైదరాబాద్‌ నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో జరిగింది. కాగా, రౌడీషీటర్లు ఇద్దరూ చిన్న నాటి స్నేహితులు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన మహ్మద్‌ నయీమ్‌(35), ఉమామహేశ్వర్‌ అలియాస్‌ జేకే మహేశ్‌ ఇద్దరు మిత్రులు. కలిసి చదువుకున్నారు.

చదువు అబ్బకపోవడంతో హత్యలు, దాడులు, గొడవలు చేయ డం ఇద్దరికి పరిపాటిగా మారింది. దీంతో ఇల్లందు పోలీసులు వీరిద్దరిపై రౌడీషీట్‌ తెరిచారు. ఇద్దరు ఇల్లందులోనే కాకుండా హైదరాబాద్‌ శివారుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సెటిల్‌మెంట్ల చేయడం, అడ్డు వచ్చిన వారిని హత్య చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఆరు నెలల క్రితం సెటిల్‌మెంట్‌ డబ్బుల పంపకాల విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. దీంతో మహేశ్‌, నయీమ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఇది గ్రహించిన నయీమ్‌ ఇల్లెందు నుంచి బండ్లగూడ సమీపంలోని రాజీవ్‌ స్వగృహ సముదాయాల్లోని సీ బ్లాక్‌కు మకాం మార్చాడు. నయీ మ్‌ అంతకుముందే భార్యతో విడాకులు తీసుకొని మరొకరితో సహజీవనం చేస్తున్నాడు.

మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి..

ఆరు నెలలుగా బండ్లగూడలో నివాసముంటున్న నయీమ్‌ అప్పుడప్పుడు మిత్రులతో కలిసి బండ్లగూడ చౌరస్తా సమీపంలోని సుప్రీం వైన్స్‌లో మద్యం సేవించేవాడు. వినాయక చవితి సోమవారం సాయంత్రం ఎప్పటిలాగే నయీమ్‌తన మిత్రులతో కలిసి సుప్రీం వైన్స్‌లో మద్యం సేవిస్తుండగా, రాత్రి 9 గంటల సమయంలో కారులో సుమారు ఏడుగురు చేరుకున్నారు. నయీమ్‌ వద్దకు మొదట ఇద్దరు వ్యక్తులు వచ్చి కండ్లల్లో కారం చల్లారు. వెంటనే మిగతా వారు ఒక్క ఉదుటున అక్కడున్న కడాయిలతో నయీమ్‌ తల, ఎదరొమ్ముపై దాడి చేశారు. వేట కొడవళ్లతో దాడి చేశారు. నయీం చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వారు కారులో పరారయ్యారు. నయీం వెంట ఉన్న మిత్రుల్లో సాయి భుజానికి స్వల్ప గాయమైంది. నాగోల్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నయీమ్‌ను హత్యచేసిన వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

Comments (0)

User